రేపటి నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సిఎంగా బాద్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా చురుకుగా కీలక నిర్ణయాలు తీసుకొంటున్న సంగతి తెలిసిందే. ఆయన అధ్యక్షతన అమరావతిలో బుదవారం శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసి) సమావేశమైంది. రేపటి నుంచి ఈ నెల 30వరకు శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని బీఏసి నిర్ణయించింది. మొత్తం 20 రోజులలో 14 పనిదినాలలో శాసనసభ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. 

రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. జూలై 12వ తేదీ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019-20 సం.లకు పూర్తి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. జగన్ ప్రభుత్వం వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నందున దానికోసం మంత్రి కన్నబాబు ఆదేరోజున వేరేగా బడ్జెట్‌ ప్రవేశపెడతారు. 

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ‘నవరత్నాలు’ పేరిట ప్రకటించిన 9 హామీల అమలుకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు కనుక ఈ బడ్జెట్‌లో వాటికే భారీగా నిధులు కేటాయించవచ్చు. కానీ వాటికి అవసరమైన భారీ నిధులు ఏవిధంగా సమకూర్చుకోవాలనుకొంటున్నారనే విషయం బడ్జెట్‌ చూస్తే కానీ చెప్పడం కష్టం.