
ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు ‘వెంకట లచ్చిమి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా వెంకట లచ్చిమి పోస్టర్ విడుదల చేశారు. కానీ అది చూసినప్పుడు పుట్టినరోజు నాడు ఇటువంటి పోస్టరా?అనుకోకుండా ఉండలేరు.
దానిలో లంగా జాకెట్ మాత్రమే ధరించి ఉన్న ఆమె చేతులకు బేడీలు వేసి, తలక్రిందులుగా వ్రేలాడదీశారు. ఆమెను ఎవరో రక్తం కారేట్లు కొట్టి చిత్రహింసలు పెట్టినట్లు ఆమె ఒంటినిండా రక్తపు మరకలున్నాయి. ఆమె మెడలో మంగళ సూత్రం మొహంపై ఉంది. ఇది ఓ ఆదివాసీ మహిళా నిజ జీవిత కధ అని దర్శకుడు ముని తెలిపారు. అణచివేతకు, దౌర్జన్యాలకు గురైన ఆమె ఎదురుతిరిగి పోరాడటం, దాని పర్యవసానాల స్పూర్తితో ఈ సినిమా తీస్తున్నామని ముని చెప్పారు.
పాన్ ఇండియా మూవీగా 5 భాషలతో పాటు మరాఠీ భాషలో కూడా ఈ సినీ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా నిర్మాతలు రాజాసాబ్, పవన్ బండ్రేడ్డి. త్వరలో ఫస్ట్ గ్లిమ్స్, పూర్తి వివరాలు వెల్లడిస్తామని దర్శకుడు ముని చెప్పారు.