విశ్వంభర షూటింగ్‌ సమాప్తం!

మల్లాది వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి, త్రిష, ఆషిక రంగనాథ్ ప్రధాన పాత్రలలో చేస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం   ‘విశ్వంభర’ షూటింగ్‌ పూర్తయింది. శుక్రవారం హైదరాబాద్‌లో చిరంజీవి, బాలీవుడ్‌ బ్యూటీ మౌనీరాయ్‌ పాల్గొన్న ప్రత్యేక గీతం షూటింగ్‌తో విశ్వంభర చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు మల్లాది ప్రకటించారు. సుమారు వంద మంది పాల్గొన్న ఈ ప్రత్యేక గీతాన్ని ప్రముఖ నృత్య దర్శకుడు గణేష్ ఆచార్య పర్యవేక్షణలో చిత్రీకరించారు. 

ఈ సినిమాలో మిగిలిన 5 పాటలను ఎంఎం కీరవాణి స్వరపరిచి సంగీతం అందించగా ఈ ఒక్క పాటకు మాత్రం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.   

విశ్వంభరలో చిరంజీవి ‘భీమవరం దొరబాబు’గా నటించగా, కునాల్ కపూర్, సురభి ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా,  కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు. 

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే ప్రకటించనున్నారు. 

ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేయగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార జంటగా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్ మొదలుపెట్టి అప్పుడే మూడవ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది.