పదేళ్ళ తర్వాత మళ్ళీ ఆ కుర్చీలో ఎస్‌జె సూర్య

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు ఎస్‌జె సూర్య సరిపోదా శనివారం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.  ఆయన మంచి నటుడే కాకుండా మంచి రచయిత, దర్శకుడు కూడా. కానీ నటుడుగా అందరినీ మెప్పిస్తుండటంతో గత పదేళ్లుగా ఆయన నటుడుగానే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. మళ్ళీ ఇన్నేళ్ళ విరామం తర్వాత ఆయన సొంతంగా వ్రాసుకున్న కధ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, స్వీయ దర్శకత్వంలో ‘కిల్లర్’ అనే సినిమాలో హీరోగా నటించబోతున్నారు. 

దీనిని ఆయన సొంత నిర్మాణ సంస్థ ఏంజల్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించబోతోంది. కనుక నిర్మాతలు ప్రవీణ్, బైజు గోపాలన్‌లతో కలిసి ఎస్‌జె సూర్య ఈ సినిమా నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు ఏఆర్‌ రహమాన్ సంగీతం అందించబోతున్నారు. 

ఈ సినిమాని 5 భాషలలో పాన్‌ ఇండియా మూవీగా నిర్మించబోతున్నారు. కనుక ఈ సినిమాపై ఎస్‌జె సూర్య ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్దమవుతోంది. త్వరలోనే ఈ సినిమాలో నటీనటులు, ఈ సినిమాకు పనిచేయబోతున్న సాంకేతిక బృందం వివరాలు ప్రకటిస్తామని ఎస్‌జె సూర్య తెలిపారు.