జూ.ఎన్టీఆర్‌ చేతిలో ఉన్న పుస్తకం అదే..

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌ ఓ పౌరాణిక సినిమా చేయబోతున్నట్లు వార్తలు, ఫోటోలు వస్తున్న నేపధ్యంలో అది నిజమే అని ధృవీకరిస్తున్నట్లు జూ.ఎన్టీఆర్‌ చేతిలో ఓ పుస్తకం కనిపించింది. 

ఇటీవల జూ.ఎన్టీఆర్‌ ముంబయి విమానాశ్రయంలోకి వెళుతున్నప్పుడు ఆయన చేతిలో కనిపించిన పుస్తకం, తమిళ రచయిత ఆనంద బాలసుబ్రహ్మణ్యం వ్రాసినఅ ‘మురుగ ది లార్డ్ ఆఫ్ వార్, ది లార్డ్ ఆఫ్ విస్డమ్‌.’ 

తెలుగువారు సుబ్రహ్మణ్యస్వామిగా కొలిచే దేవుడిని తమిళ ప్రజలు ‘మురుగన్‌’గా పూజిస్తుంటారు. కనుక జూ.ఎన్టీఆర్‌ ‘మురుగన్’ పాత్ర చేయబోయే ముందు ఆ పుస్తకం చదివి తను చేయబోయే పాత్రని అర్దం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

జూ.ఎన్టీఆర్‌ ఆ పుస్తకం మీడియా కంటపడకూడదని అనుకుంటే దానిని భద్రంగా బ్యాగ్‌లో పెట్టుకునేవారు. కానీ పుస్తకం పేరు కనపడేలా పట్టుకొని వెళ్ళడం చూస్తే తాను చేయబోయే సినిమా ప్రమోషన్ కోసమే అని అనుకోవచ్చు. సినీ పరిశ్రమలో ఉన్నవారు ఈవిదంగా కూడా తమ సినిమాలపై మీడియా, జనంలో ఆసక్తి రేకెత్తేలా చేసి హైప్ క్రియేట్ చేసుకోవడం పరిపాటే.  

జూ.ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటి రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా, మలయాళ నటుడు టోవినో థామస్ ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు. 

‘డ్రాగన్’ సినిమాని బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సిరీస్, టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్లపై గుల్షన్ కుమార్‌ సమర్పణలో భూషణ్ కుమార్‌, నవీన్ ఎర్నేని, రవిశంకర్, కళ్యాణ్ రామ్ కలిసి  పాన్‌ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా పూర్తిచేసిన తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో మురుగన్ సినిమా మొదలుపెట్టబోతున్నారు.