శివయ్యా.. నన్ను క్షమించు: మంచు మనోజ్

మంచు విష్ణు, మనోజ్ మద్య జరిగిన గొడవలు కుటుంబం దాటి, ఇంటి గేటు దాటి, పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్ళిన సంగతి తెలిసిందే. కానీ మంచు మనోజ్ అంతటితో ఆగలేదు. వాటిని తమ సినిమాల వరకు తీసుకువెళ్ళి మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాకు పోటీగా తన భైరవం రిలీజ్‌ డేట్ ప్రకటించారు.

దాంతో కన్నప్ప వాయిదా వేసుకోవడంతో భయపడి వాయిదా వేసుకున్నాడని ఎద్దేవా చేశారు. మంచు విష్ణు శివయ్యా అంటూ ఎంత వేడుకున్నా ఆ సినిమా హిట్ అవదంటూ శాపాలు కూడా పెట్టారు.

అయితే కన్నప్పలో ప్రభాస్‌ ఉన్నారనే సంగతి మరిచిపోయారు. దాంతో ప్రభాస్‌ అభిమానులు ‘బాయ్‌కాట్  భైరవం’ అంటూ సోషల్ మీడియాలో ఉదృతంగా ప్రచారం మొదలుపెట్టడంతో మంచు మనోజ్ షాక్ అయ్యారు.

ఎందుకంటే, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించిన ‘భైరవం’ ఈ నెల 30న విడుదల కాబోతోంది. ప్రభాస్‌ అభిమానులు దెబ్బకు ‘భైరవం’కు ఎదురుదెబ్బ తగిలితే, ఆ సినిమా దర్శక నిర్మాతలతో పాటు మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురికీ ఎదురుదెబ్బ తగులుతుంది.

ముగ్గురూ సినీ ఇండస్ట్రీలో నిలద్రొక్కుకోవడానికి తిప్పలు పడుతున్నారు కనుక ‘భైరవం’ బోల్తా పడితే చాలా ఇబ్బందికరంగా మారుతుంది.

అందుకే మంచు మనోజ్ సోదరుడు మంచు విష్ణుకి, కన్నప్పలో నటించిన ప్రభాస్‌తో సహా అందరికీ క్షమాపణలు చెప్పుకున్నారు.

ఆరోజు ఏదో ఆవేశంలో శివయ్య అంటూ మాట్లాడానని, కానీ కన్నప్ప అంటే మంచు విష్ణు ఒక్కడే కాదు లైట్ బాయ్ నుంచి ప్రభాస్‌ వరకు అనేక మంది కష్టపడి తీసిన సినిమా కనుక ఆ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నానని మంచు మనోజ్ ఎక్స్ వేదికగా ఓ వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే..