
ఇటీవల విడుదలైన చిన్న సినిమాలలో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అందరినీ ఎంతగానో అలరించింది. కోలీవుడ్ దర్శకుడు అశ్వత్ ముత్తు దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాధన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఈ నెల 21న నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతోంది. ఆరోజు నుంచే తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ భాషలలో ఒకేసారి ప్రసారంఅవుతుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది.
కధేమిటంటే, ఒకప్పుడు చదువులలో టాపర్గా ఉండే హీరో ఇంజనీరింగ్లో చేరాక దారి తప్పుతాడు. అతనితో ప్రేమలో పడిన హీరోయిన్ (అనుపమ పరమేశ్వరన్) అతని ధోరణి చూసి బ్రేకప్ చెప్పేస్తుంది.
ఆ తర్వాత హీరోలో మార్పు వస్తుంది. కానీ జీవితంలో రాణించేందుకు షార్ట్ కట్ ఎంచుకుంటాడు. నకిలీ సర్టిఫికేట్స్ పెట్టి పెద్ద ఉద్యోగం సంపాదించుకొని దాంతో ఇల్లు, కారు అన్నీ కొనుకొని సెటిల్ అవుతాడు. కనుక తన స్థాయికి తగిన అమ్మాయి (కయాడు లోహర్)తో పెళ్ళికి సిద్దమవుతాడు.
కానీ నకిలీ సర్టిఫికెట్స్ పెట్టి ఉద్యోగం సంపాదించిన విషయం ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ (మిస్కిన్)కు తెలుస్తుంది. ఈ సినిమా ఎలాగూ మార్చి 21న నెట్ఫ్లిక్స్లోకి వచ్చేస్తోంది కనుక ఆ తర్వాత ఏం జరిగిందో ఓటీటీలో చూసి తెలుసుకుంటే బాగుంటుంది.