నిర్మాత నాకు డబ్బులు ఇవ్వలేదు.. మీరే దిక్కు: బ్రహ్మాజీ

మంగళవారం హైదరాబాద్‌లో ‘బాపు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈ సినిమాలో ఓ ప్రధానపాత్ర చేసిన బ్రహ్మాజీ మాట్లాడుతూ, “ఈ విషయం అందరి ముందు చెప్పేస్తున్నాను. మా నిర్మాతగారు నా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. సినిమా కలెక్షన్స్‌ బాగా వస్తే ఇస్తానని చెప్పారు. కనుక ప్రేక్షకులు అందరినీ వేడుకుంటున్నాను. అందరూ టికెట్స్ కొనుకొని థియేటర్లలో బాపు సినిమా చూసి ఆనందించండి. నా డబ్బులు నాకు ఇప్పించండి,” అని అన్నారు. బ్రహ్మాజీ మాటలు విని నిర్మాతలు రాజు, భాను ప్రసాద్ రెడ్డిలతో సహా అందరూ నవ్వుకున్నారు. 

ఈ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన బుచ్చిబాబు సనా మాట్లాడుతూ, “బ్రహ్మాజీ పిలవగానే భయపడి వచ్చేశాను. లేకుంటే వీడికి పొగరు అని అందరికీ టామ్ టామ్ చేసేస్తారు. బాపు సినిమా ట్రైలర్‌ చూశాను చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. సూపర్ హిట్ అవుతుంది,” అని అన్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు ‘ఉప్పెన’ సినిమా రిలీజ్‌ అయినప్పుడు జరిగిన ఓ విషయం బయటపెట్టారు. ఆ సినిమా చూసేందుకు తన తల్లితండ్రులు థియేటర్‌కి వెళ్ళారని కానీ తన తండ్రి మాత్రం లోపలకు వెళ్ళకుండా థియేటర్‌కి గేట్ వద్ద నిలబడి సినిమా చూసొచ్చినవారిని ‘సినిమా ఎలా ఉంది?’ అని అడిగి తెలుసుకుంటూ వారు బాగుందని చెపితే చాలా సంతోషించారని చెప్పారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆయన చనిపోయారని తెలిపారు. ఇప్పుడు రామ్ చరణ్‌తో తీయబోయే సినిమా ఎలా ఉంటుందని ఎవరూ ఆడగక్కరలేదని అభిమానుల అంచనాలకు మించే ఉంటుందని బుచ్చిబాబు చెప్పారు.