
సోమవారం సాయంత్రం హైదరాబాద్లో తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానిలో అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా పాల్గొంటారంటూ సోషల్ మీడియాలో తండేల్ చిత్ర బృందం పోస్టర్స్ వేసుకొని మరీ ప్రచారం చేసుకుంది. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్ రాలేదు. ఏమంటే ఎసిడిటీ సమస్య కారణంగా రాలేకపోయారని అల్లు అరవింద్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకే అల్లు అర్జున్ విదేశాల నుంచి హైదరాబాద్ తిరిగివచ్చారు. కానీ ఆరోగ్యం బాగోకపోవడంతో రాలేకపోయారు అని చెప్పారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ డుమ్మా కొడుతున్నట్లు తెలియగానే దర్శకుడు సందీప్ వంగాని ఆహ్వానించగా ఆయన వచ్చి పాల్గొన్నారు.
సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనపై శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి అల్లు అర్జున్ హైదరాబాద్లో జరిగే ఏ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు.
కనుక తొలిసారిగా సోమవారం తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంటారనుకుంటే దానికీ మొహం చాటేశారు. ఎసీడీటీ పెద్ద ఆరోగ్య సమస్య కాదు కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేదికపైకి రాకపోయినా కనీసం కార్యక్రమంలో పాల్గొని ఉంటే గౌరవంగా ఉండేది. కానీ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా వస్తున్నారంటూ తండేల్ బృందం అంతగా ప్రచారం చేసుకున్న తర్వాత మొహం చాటేసి వారిని నిరాశపరిచారు. ఇటువంటివే సినీ పరిశ్రమలో వ్యక్తుల మద్య దూరం పెంచుతుంటాయి కదా?