ఒడిశాలో రాజమౌళి టీమ్‌

రాజమౌళి టీమ్‌ ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తోంది. మహేష్ బాబు హీరోగా చేయబోయే సినిమా లొకేషన్స్ కోసం రాజమౌళి తన బృందాన్ని తీసుకొని ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చేరుకున్నారు. అక్కడే రెండు రోజులు ఉండి, ఆ జిల్లాలోని అటవీ ప్రాంతాలను పరిశీలించనున్నారు.

ఇప్పటికే ఆఫ్రికా అడవులలో కొన్ని లొకేషన్స్ ఎంపిక చేసుకున్న రాజమౌళి ఇప్పుడు ఒడిశాలో కూడా రెండు మూడు లొకేషన్స్ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. లొకేషన్స్ చూసుకునేందుకు రాజమౌళి బృందం వచ్చారని తెలుసుకొని వారిని చూసేందుకు ఒడిశా అభిమానులు వారు బస చేసిన హోటల్ వద్దకు వస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. జనవరి నెలాఖరు నుంచి లేదా ఫిబ్రవరి రెండో వారంలోగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ మొదలయ్యే అవకాశముంది. అడవులలో సాహసయాత్ర కధాంశంతో తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు నటించబోతున్నారు. బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో కెఎల్ నారాయణ ఈ సినిమాని నిర్మించబోతున్నారు.