
సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “అల్లు అర్జున్ నా కుటుంబానికి అండగా నిలబడుతున్నారు. ఆయన మనుషులు ప్రతీరోజూ ఆస్పత్రికి వచ్చి మా అబ్బాయి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ధైర్యం చెపుతున్నారు. ఇవాళ్ళే దిల్ రాజుగారు కూడా వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఆయన కూడా మాకు అండగా నిలబడతామని చెప్పారు.
అల్లు అర్జున్ ప్రకటించిన 25 లక్షల్లో పది లక్షలు మాకు అందాయి. మిగిలిన సొమ్ము కూడా ఇస్తామని చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ మాకు రూ.50 లక్షలు ఇచ్చింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా మా అబ్బాయి ట్రీట్మెంట్ విషయం చూసుకుంటున్నారు.
అందరూ మాకు ఇంత అండగా నిలబడుతున్నప్పుడు ఇంకా అల్లు అర్జున్ మీద కేసు కొనసాగించడం అనవసరమని భావిస్తున్నాను. ఈ కేసు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నాను,” అని అన్నారు.
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ, “ఈ దుర్ఘటన సినీ పరిశ్రమలో మా అందరికీ చాలా బాధ కలిగించింది. భాస్కర్కు సినీ పరిశ్రమలో శాశ్విత ఉద్యోగం ఇచ్చి ఆయన కుటుంబాన్ని అన్ని విదాల ఆదుకుంటాము.
రెండు మూడు రోజులలోనే సినీ పరిశ్రమలో అందరం కూర్చొని అన్ని విషయాలు చర్చించుకున్న తర్వాత అందరం వెళ్ళి సిఎం రేవంత్ రెడ్డిని వెళ్ళి కలుస్తాము. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకి మద్య నేను వారధిలా ఉంటానని ముందే చెప్పాను. కనుక ఈ భేధాభిప్రాయలు తొలగించేందుకు ణా వంతు కృషి చేస్తాను,” అని అన్నారు.