
మెగాస్టార్ చిరంజీవి అని గూగుల్లో టైప్ చేయగానే వందల పేజీల సమాచారం, వేలాది ఫోటోలు, వీడియోలు ప్రత్యక్షమవుతాయి. అయితే 1974-75లో ఆయన పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపూర్లో వైఎన్ఎం కాలేజీలో బీ.కాం రెండో సంవత్సరం చదువుకున్నప్పుడు తీసిన ఫోటోని ఎవరైనా చూశారా? లేదా చిరంజీవి స్వయంగా ఆ ఫోటోని, తన 50 ఏళ్ళ నట ప్రస్థానం ఏవిదంగా మొదలైందో తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో నేడు ఓ పోస్ట్ పెట్టారు.
దానిలో ఆనాడు తొలిసారిగా నేను మా కాలేజీలో జరిగిన నాటక పోటీలలో పాల్గొన్నప్పుడు, తొలిసారిగా నేను ‘రాజీనామా’ నాటకంతో రంగస్థలం ఎక్కాను. ఆ తొలిపోటీలోనే నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. అలా1974లో మొదలైన నా నట ప్రస్థానం 2024 వరకు 50 ఏళ్ళుగా సాగిపోతూనే ఉంది. ఈ 50 సంవత్సరాలలో ఎనలేని ఆనందం పొందాను,” అని తన మనసులో భావనలు అభిమానులతో పంచుకున్నారు. నిజమే కదా! ఒక మనిషి 50 ఏళ్ళు జీవించడం గొప్ప విషయం కాదు. ఒక మనిషి జీవితంలో 50 ఏళ్ళపాటు నటిస్తుండటం చాలా గొప్ప విషయమే కదా?
పునాది రాళ్ళతో తన సినీ జీవితానికి బలమైన పునాది వేసుకున్న చిరంజీవి మెగాస్టార్గా ఎదిగి విశ్వంభర వరకు సాగి ఇంకా ముందుకు సాగిపోతూనే ఉన్నారు. దశాబ్ధాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటన, సినిమాలతో అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి 50 ఏళ్ళ నట జీవితం పూర్తిచేసుకున్న సందర్భంగా అభినందనలు.