
జానీ మాస్టర్ కేసులో ఇప్పటికే మీడియా, సోషల్ మీడియాలో అందరూ తీర్పులు ఇచ్చేస్తున్నారు. అయితే భారతీయ సినీ పరిశ్రమని కుదిపేస్తున్న ఈ వ్యవహారంపై టాలీవుడ్ మాత్రం చాలా ఆచితూచి స్పందిస్తోంది. ఇంతవరకు నాగబాబు, ఇప్పుడు మంచు మనోజ్ మాత్రమే కాస్త బ్యాలన్స్గా మాట్లాడారు.
మంచు మనోజ్ స్పందిస్తూ, జానీ మాస్టర్ మీరు ఈ స్థాయికి చేరుకునేందుకు ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. తప్పు, ఒప్పు అనేది చట్టం తేల్చుతుంది.
ఒక మహిళ తన స్వరం వినిపించినప్పుడు పారిపోతే అది సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తుంది. కనుక మీరు తప్పు చేసి ఉంటే ధైర్యంగా ఒప్పుకోండి లేకుంటే ధైర్యంగా పోరాడండి. అంతేగానీ పారిపోవద్దు. ఈ కేసులో చాలా వేగంగా స్పందించిన పోలీసులకు నా అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమలో మహిళలకు అండగా నిలబడదాం. ఎవరూ ఒంటరిగా లేరని వారికి మనమందరం అండగా ఉన్నామని తెలియజేద్దాం,” అన్నారు.