ఒకే వేదికపై చిరంజీవి, అల్లు అర్జున్‌... అంతా ఓకేనా?

అల్లు అర్జున్‌ కారణంగా గత రెండు మూడు నెలలుగా మెగా ఫ్యామిలీ-అల్లు ఫ్యామిలీ మద్య కాస్త ఘర్షణ వాతావరణం నెలకొంది. నిజానికి అలా ఉందని అభిమానులు, నెటిజన్స్ భావించుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఘర్షణ పడుతున్నారు.

అల్లు అర్జున్‌ నంద్యాల వెళ్ళి వైసీపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శిల్పా రవికి మద్దతు పలికినప్పటి నుంచి ఈ గొడవలు మొదలయ్యాయి. తాజాగా ఓ సినీ ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. అల్లు అర్జున్ చేత ఆయన తండ్రి అల్లు అరవింద్ ఇదంతా చేయిస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

అయితే ఈ స్థాయి హీరోల మద్య ఇటువంటి మనస్పర్ధలు ఇండస్ట్రీకి చాలా నష్టం కలిగిస్తాయి. కనుక ఇండస్ట్రీలోని నందమూరి బాలకృష్ణ అభిమానులు ఈ వివాదాలకు ముగింపు పలికేందుకు సిద్దమయ్యారు.

బాలకృష్ణ సినీ పరిశ్రమలో ప్రవేశించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్‌ 1వ తేదీన హైదరాబాద్‌లో హైటెక్స్ వద్ద నోవాటేల్ హోటల్‌లో అట్టహాసంగా వేడుకలు నిర్వహించబోతున్నారు.

ఆ వేడుకలకి మెగాస్టార్ చిరంజీవిని, అల్లు అర్జున్‌ ఇద్దరినీ ఆహ్వానించిన్నట్లు సమాచారం. దానికి వారు అంగీకరిన్నట్లు తెలుస్తోంది. కనుక ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ వివరణ ఇచ్చుకొని ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతారా?లేదా మరేదైనా మాట్లాడి సమస్యని ఇంకా పెద్దది చేస్తారో చూడాలి.