ఆ వివాదం నుంచి ఇప్పుడే బయటపడ్డా: రాజ్‌తరుణ్‌

గత నెలరోజుల పాటు మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రాజ్‌తరుణ్‌-లావణ్య-మాల్యా మల్హోత్రాల వ్యవహారం, కేసు గురించి కధనాలే కనిపించేవి వినిపించేవి. కానీ హటాత్తుగా అన్నీ ఆగిపోయాయి.

ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే రాజ్‌తరుణ్‌ నటించిన రెండు సినిమాలు పురుషోత్తముడు, తిరగబడరా సామి వారం రోజుల వ్యవధిలో ఒకదాని తర్వాత మరొకటి విడుదలయ్యాయి. కానీ రెండూ ఫ్లాప్ అయ్యాయి.

తాజాగా రాజ్‌తరుణ్‌ నటించిన మూడో సినిమా ‘భలే ఉన్నాడే’ సెప్టెంబర్‌ 2న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రాజ్‌తరుణ్‌కి జంటగా మనీషా చేసింది. దర్శకుడు పవన్‌ కళ్యాణ్‌ దర్శకత్వంలో జె.శివసాయి వర్ధన్ ఈ సినిమాని నిర్మించారు. 

ఈ సినిమా విడుదల సందర్భంగా రాజ్‌తరుణ్‌, దర్శక నిర్మాతలతో కలిసి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడినప్పుడు, ఓ విలేఖరి లావణ్య కేసు గురించి ప్రశ్నించగా రాజ్‌తరుణ్‌, “రెండు నెలలుగా ఆ సమస్యతో నేను చాలా మానసిక క్షోభ అనుభవించాను. ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడుతున్నాను. దయచేసి నన్ను మళ్ళీ ఆ వివాదం గురించి అడిగి ఇబ్బంది పెట్టకండి’ సూటిగా చెప్పాడు.

ఆ తర్వాత తన సినిమా, దర్శక, నిర్మాతల గురించి రాజ్‌తరుణ్‌ మాట్లాడాడు. అయితే ఈ వివాదం నుంచి బయటపడ్డానని రాజ్‌తరుణ్‌ చెప్పడాన్ని బట్టి లావణ్యతో ఈ కేసుని బయట సెటిల్ చేసుకున్నట్లు భావించవచ్చు. బహుశః ఆమె పోలీస్ కేసు వాపసు తీసుకుని ఉండొచ్చు.