కల్కి ఎడి2898 తర్వాత ప్రభాస్ పేరు దేశవిదేశాలలో మరోసారి మారుమ్రోగిపోయింది. దాని తర్వాత మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంతమేర పూర్తిచేశారు. అది పూర్తికాక మునుపే హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమాకి నేడు హైదరాబాద్లో పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమా నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈవిషయం ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ కధ జరిగిన్నట్లు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. కనుక ఈ సినిమాకి ‘ఫౌజీ’ (సైనికుడు) అనే పేరుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ ఫోటోలో ప్రభాస్ పక్కన నిలుచున్న అమ్మాయి పేరు ఇమ్మాన్ ఇస్మాయిల్. ఢిల్లీకి చెందిన ఇమ్మాన్ మంచి డాన్సర్, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఇమ్మాన్ ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక అవడంతో వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొంది. అయితే మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నాయి. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు ఈ సినిమాకి సంబందించి మరిన్ని వివరాలు ప్రకటించబోతున్నారు.