మహేష్‌ బాబు-రాజమౌళి సినిమా షూటింగ్‌ అప్పుడే కాదట!

రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ బాబు 29వ సినిమా (ఎస్ఎస్‌ఎంబీ29) గురించి ప్రముఖ నిర్మాత, దుర్గా ఆర్ట్స్ అధినేత ఎస్.గోపాల్ రెడ్డి కొన్ని కొత్త విషయాలు చెప్పారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ ఎన్టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమా నిర్మాణంలో తమ సంస్థ కూడా భాగస్వామి కాబోతోందని చెప్పారు. 

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పని తుది దశలో ఉందని, బహుశః వచ్చే ఏడాది మే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ మొదలవవచ్చని చెప్పారు. సుమారు 12 ఏళ్ళ క్రితమే రాజమౌళి ఓ గొప్ప దర్శకుడు అవుతారని తాను, కెఎల్ నారాయణ గుర్తించామని, ఎప్పటికైనా ఆయన దర్శకత్వంలో తమ బ్యానర్‌పై ఓ సినిమా చేయాలనుకుంటున్నామని అప్పుడే ఆయనకు చెప్పగా సరే అన్నారని గోపాల్ రెడ్డి చెప్పారు. కానీ ఆయనకున్న కమిట్‌మెంట్స్ వలన ఇన్నేళ్లు వేచి చూడాల్సివచ్చిందని గోపాల్ రెడ్డి చెప్పారు. 

మహేష్‌ బాబుతో కూడా తమ బ్యానర్‌లో ఓ సినిమా చేయాలనుకున్నామని ఆ కోరిక కూడా ఈ సినిమాతో నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని గోపాల్ రెడ్డి చెప్పారు.      

మహేష్‌ బాబు-రాజమౌళి సినిమా షూటింగ్‌ ప్రారంభించేందుకే మరో ఏడాది పడుతుందని గోపాల్ రెడ్డి చెప్పడం  మహేష్‌ బాబు అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించక మానదు. ఆ తర్వాత అది పూర్తి చేయడానికి రాజమౌళి   మరో 2-3 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువే సమయం తీసుకోవచ్చు. మరో నాలుగేళ్ళ వరకు అంటే 2028 వరకు మహేష్‌ బాబు సినిమా ఉండదన్న మాట! 

వీడియో ఎన్టీవీ సౌజన్యంతో...