
కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా తీస్తున్న దేవర సినిమాకి సంబంధించి, కొన్ని అప్డేట్స్ ఇచ్చింది ఆ చిత్ర బృందం.
హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కేన్నీ బెట్స్ దర్శకత్వంలో చిత్రీకరించిన దేవర యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని చెప్పింది. ముఖ్యంగా నీళ్ళ అడుగున తీసిన ఒళ్ళు గగుర్పొడిచే కొన్ని యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని దేవర బృందం చెప్పింది. దీని షూటింగ్ మొదటే పూర్తి చేశామని, ఆ సన్నివేశాలను మరింత రక్తి కట్టించేందుకు వీఎఫ్ఎక్స్ తో తీర్చిదిద్దుతున్నామని చెప్పింది.
దేవరలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని, అయితే విలన్గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ షూటింగ్లో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్నందున ఆయనతో మరికొన్ని యాక్షన్ సన్నివేశాలు తీయవలసి ఉందని దేవర బృందం చెప్పింది. ఈలోగా సినిమాలో మిగిలిన నాలుగు పాటల షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళి పూర్తి చేస్తామని చెప్పింది.
దేవర సినిమా ఏప్రిల్కు 5వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ సైఫ్ అలీ గాయపడటం, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవుతుండటం, అదే సమయంలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం వంటి కారణాలతో సినిమా రిలీజ్ వాయిదా పడవచ్చని తెలుస్తోంది.
దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి రూ.300కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు.