నాగార్జున, ధనుష్, శేఖర్ కమ్ముల... వావ్ భలే కాంబినేషన్‌

టాలీవుడ్‌ అగ్రహీరోలలో కాస్త భిన్నమైన సినిమాలతో ప్రయోగాలు చేయడంలో అక్కినేని నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. అలాగే కోలీవుడ్‌లో ధనుష్ సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలను ప్రతిబింభించే చక్కటి సినిమాలు చేస్తూ అందరినీ మెప్పిస్తుంటారు. టాలీవుడ్‌లో మిగిలిన దర్శకులకు పూర్తి భిన్నమైన వ్యక్తి శేఖర్ కమ్ముల. వరుసపెట్టి సినిమాలు చుట్టేయలనుకోకుండా రెండు మూడేళ్ళకు ఓ చక్కటి క్లాసిక్ సినిమాని అందిస్తూ తన సినిమా కోసం అందరూ ఎదురుచూసేలా చేసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. 

గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిపి ధనుష్ మీద కొన్ని సన్నివేశాలు షూట్‌ చేశారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. 

శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని నిర్మాతలు చెప్పారు.