
త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి ‘దమ్ మసాలా’ అంటూ సాగే ఓ వీడియో సాంగ్ ఇటీవల లీక్ అవడంతో, దీపావళికి రిలీజ్ చేద్దామనుకొన్న ఆ పాటని ముందుగానే రిలీజ్ చేయక తప్పడంలేదు. ఆ పాట ప్రమో నిన్న ఆదివారం విడుదల చేశారు. పూర్తిపాటని రేపు మంగళవారం రిలీజ్ చేస్తామని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ప్రకటించింది.
“ఎదురొచ్చే గాలి...ఎగరేస్తున్న చొక్కాపై గుండీ...” అంటూ మొదలయ్యే రామజోగయ్య శాస్త్రి వ్రాసిన పాటను తమన్ స్వరపరచగా, సంజీత్ హెగ్డే పాడారు. గుంటూరు కారం అంటే చాలా ఘాటుగా ఉండాలి కానీ ఈ పాట ప్రమో చాలా చప్పగా ఉంది. ఈ పాట లిరిక్స్, తమన్ అందించిన మ్యూజిక్ రెండూ కూడా చాలా రొటీన్గా ఉన్నాయి.
ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమాని 2024, జనవరి 12న సంక్రాంతి పండుగకు విడుదల చేయాలనుకొన్నారు కనుక ఆ ప్రకారం పాటలు రిలీజ్ చేద్దామని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకొంటే సెట్స్లో నుంచి ఓ పాట లీక్ అవడంతో చాలా ఇబ్బందికరంగా మారింది. కనుక దీపావళి పండుగకు పూర్తి పాటను విడుదల చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
గుంటూరు కారం సినిమా మహేష్ బాబుకి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, రావు రమేష్, రమ్య కృష్ణ, జగపతి బాబు, జయరాం, బ్రహ్మానందం, సునీల్, రఘుబాబు, మహేష్ ఆచంట తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.