గేమ్ ఛేంజర్‌... మళ్ళీ మొదలెట్టేశారు

శంకర్ దర్శకత్వం రామ్ చరణ్‌ కియరా అద్వానీ జోడీగా తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’ షూటింగ్‌ మళ్ళీ మొదలైంది. ఈ సినిమా దర్శకుడు శంకర్ ఒకేసారి రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్‌, కమల్‌హాసన్‌తో భారతీయుడు-2 మొదలుపెట్టడంతో రెంటికీ పూర్తి సమయం కేటాయించలేకపోతున్నారు.

దీంతో గేమ్ ఛేంజర్‌లో కొన్ని సన్నివేశాలు యువ దర్శకుడు శైలేశ్ కొలనుకు అప్పగించి, తాను కమల్‌హాసన్‌తో భారతీయుడు-2 సినిమా చేసుకొంటున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటిని రామ్ చరణ్‌ కానీ ఈ సినిమాను నిర్మిస్తున్న దిల్‌రాజుగానీ ఖండించకపోవడంతో అవి నిజమేనని చాలా మంది భావిస్తున్నారు.

కానీ వాస్తవం ఏమిటంటే, గేమ్ ఛేంజర్‌లో గత షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత రామ్ చరణ్ స్వయంగా బ్రేక్ తీసుకొన్నారు. ఉపాసన డెలివరీకి ముందు నెలరోజులు ఆమెతో కలిసి ఉండేందుకు బ్రేక్ తీసుకొన్నారు. అందుకే శంకర్ భారతీయుడు-2 పూర్తి చేసేందుకు చెన్నై వెళ్ళిపోయారు. ఇప్పుడు రామ్ చరణ్ షూటింగ్‌లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శంకర్ కూడా తిరిగివచ్చి షూటింగ్‌ ప్రారంభించారు.    

దీంతో శంకర్ భారతీయుడుకి బ్రేక్ ఇచ్చి మళ్ళీ గేమ్ ఛేంజర్‌ మొదలుపెట్టారు. వెంటనే హైదరాబాద్‌ వచ్చి గేమ్ ఛేంజర్‌లో యాక్షన్ సన్నివేశాలను షూటింగ్‌ మొదలుపెట్టారు. ఇదే విషయం తెలియజేస్తూ లొకేషన్‌లో ఉన్న తన ఫోటోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కనుక మళ్ళీ గేమ్ ఛేంజర్‌ షూటింగ్ మొదలైంది.    

 గేమ్ ఛేంజర్‌ సినిమాలో రామ్ చరణ్‌ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. తండ్రి పాత్రకు జోడీగా అంజలి నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, జయరాం, నవీన్ చంద్ర, నాజర్, రఘుబాబు, సముద్రఖని తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 


రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కధ: కార్తీక్ సుబ్బరాజు, కెమెరా తిరు, ఆర్‌ రత్నవేలు, థమన్ సంగీతం అందిస్తున్నారు.