
కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో వచ్చిన బింబిసార ఆగస్ట్ 5న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయ్యి భారీ కలెక్షన్స్ సాధించింది. ఈ నెల 21వ తేదీన జీ5 ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు ఆ సంస్థ ట్విట్టర్లో ప్రకటించింది.
బింబిసార, సల్మాన్ దుల్కర్ హీరోగా చేసిన సీతారామం రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొన్నాయి. అయితే సీతారామం సినిమా కొన్నిరోజుల క్రితమే ఓటీటీలో విడుదలై అక్కడా మంచి ఆదరణ పొందింది. బింబిసార కూడా అప్పుడే ఓటీటీలోకి రావాలసి ఉంది కానీ కాస్త ఆలస్యమైంది. థియేటర్లను షేక్ చేసిన బింబిసార ఓటీటీని కూడా షేక్ చేయడం ఖాయమే అని భావించవచ్చు.
బింబిసారలో కళ్యాణ్ రామ్ బింబిసార చక్రవర్తిగా, దేవదత్తుడిగా ద్విపాత్రాభినయం చేసి రెండు పార్టీలలో ప్రేక్షకులను మెప్పించాడు. నూతన దర్శకుడు వశిష్ట్ తొలిప్రయత్నంలోనే ఇటువంటి క్లిష్టమైన హిస్టారికల్ ఫాంటసీ కధను ఎంచుకోవడమే కాకుండా దానిని అంతే అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులు మెచ్చేవిదంగాతీయడం, తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టడం చాలా అభినందనీయం.
బింబిసారలో కేథరిన్ త్రేసా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించి మెప్పించారు. ప్రకాశ్ రాజ్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
కల్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కొసరాజు హరికృష్ణ బింబిసార చిత్రాన్ని నిర్మించారు. బింబిసార హిట్ అవడంతో దీనికి సీక్వెల్గా తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.