నన్ను ఆకాశానికి ఎత్తేయకండి: మాధవన్

ఇటీవల విడుదలైన అత్యుత్తమ చిత్రాలలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన రాకెట్రీ చిత్రం కూడా ఒకటి. దీనిని స్వయంగా నిర్మించి నంబి నారాయణన్‌గా అద్భుతంగా నటించారు మాధవన్. అయితే దీని కోసం మాధవన్ తను ఎంతగానో ఇష్టపడి కట్టుకొన్న ఇంటిని కూడా అమ్మేశారని సోషల్ మీడియాలో పుకార్లు కూడా వ్యాపించాయి. మాధవన్‌ రాకెట్రీతో తన దేశభక్తిని చాటుకొంటే, ఆయన కుమారుడు వేదాంత్ స్విమ్మింగ్ పోటీలలో భారత్‌కు బంగారు పథకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడని సోషల్ మీడియాలో మాధవన్ కుటుంబంపై ప్రశంశల వర్షం కురుస్తోంది.   

ఈ విషయం మాధవన్ దృష్టికి రావడంతో ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ, “నా స్నేహితులారా... నేనేదో గొప్ప త్యాగం చేసిన దేశభక్తుడినని నన్ను మరీ ఇంత ఆకాశానికి ఎత్తేయకండి. నేను నా ఇంటిని అమ్మలేదు. ఏదీ కోల్పోలేదు. నిజానికి, ఈ సినిమాతో సంబందంతో నేరుగా ఉన్నవారందరూ ఈ ఏడాది చాలా భారీగా ఆదాయపన్ను చెల్లించబోతున్నారని తెలియజేసేందుకు నేను చాలా గర్వపడుతున్నాను. భగవంతుని దయ వలన మేమందరం ఈ సినిమాతో చాలా మంచి పేరు, లాభాలు సంపాదించుకొన్నాము. ఇప్పటికీ నేను ఎంతగానో ఇష్టపడే నా ఇంట్లోనే ఉంటున్నాను,” అని ట్వీట్ చేశారు.