గురువారం మహాబలిపురంలో మూడుముళ్ళ బందంతో ఒక్కటైన నయనతార, విఘ్నేశ్ శివన్లు ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. ఇద్దరూ కలిసి శ్రీవారి కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పూజారులు తీర్ధప్రసాదాలు అందజేసి నూతన దంపతులను ఆశీర్వదించారు.
నయనతార చక్కగా పసుపు రంగు చీర కట్టుకొని పట్టువస్త్రాలు ధరించిన భర్త విఘ్నేశ్ శివన్ చేయి పట్టుకొని ఆలయంలోకి ప్రవేశిస్తుంటే, చూడముచ్చటగా ఉన్న వారి జంటను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. నయనతార, శివన్ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిపోయారు. వారు ఆలయం బయటకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న భక్తులు వారిని చుట్టుముట్టి తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లతో వారి ఫోటోలు తీసుకోగా, కొందరు వృద్ధులు వారి జంటను ఆశీర్వదించారు.
చాలా ఏళ్ళుగా సహజీవనం చేస్తున్న నయన్, శివన్ ఇదివరకు చాలాసార్లు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. కానీ వివాహం అయిన తరువాత తొలిసారిగా భార్యాభర్తలుగా శ్రీవారిని దర్శించుకొన్నారు.