
రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. కనుక చిత్ర బృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా ప్రారంభిస్తున్నారు. ఈనెల 19న బెంగళూరు సమీపంలోని చిక్ బల్లాపూర్లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ముఖ్య అతిధిగా వస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి వస్తే ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు హాజరవడం సహజం కనుక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా అట్టహాసంగానే జరుగబోతోందని భావించవచ్చు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న జూ.ఎన్టీఆర్కు జోడీగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్, అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్కు జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించారు. ఈ సినిమాలో ఆలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, అజయ్ దేవగన్, శ్రీయా శరణ్, అరుణ్ సాగర్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా రూపొందించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య లైకా ప్రొడక్షన్స్, పెన్గంగ భవన్ ఇండియా లిమిటెడ్, తీన్ మార్ ఫిలిమ్స్ పతాకాలపై నిర్మించారు.