క్రేజీ హీరోయిన్ ను పట్టిన శర్వానంద్

వరుస హిట్స్‌తో క్రేజీ స్టార్‌గా మారిన ఎక్స్‌ప్రెస్‌ హీరో శర్వానంద్, సినిమాలను దూకుడుగా చేసుకుంటూ దూసుకెళుతున్నాడు. హ్యాట్రిక్ హిట్స్‌తో టాలీవుడ్‌‌లో ప్రస్తుతం జోరు మీద ఉన్న శర్వా, ఇప్పటికే రెండు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. తన 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఒక ప్రాజెక్ట్ కోసం, చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్న శర్వా, మరో క్రేజీ ప్రాజెక్ట్‌ అయిన తన తరువాత సినిమాకోసం కూడా కసరత్తులు స్టార్ట్ చేశాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వేగేశ్న సతీష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి ప్రేమమ్ బ్యూటీ అనుపమ సిద్ధమైనట్లు సమాచారం. 

మలయాళంలో ప్రేమమ్ సినిమాతో సంచలనంగా మారిపోయిన అనుపమ పరమేశ్వరన్.. ఇటీవల విడుదలైన ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తెలుగు ప్రేమమ్‌లోనూ నటిస్తున్న ఈ బ్యూటీ తన తరువాత సినిమా శర్వానంద్‌తో చేయనున్నట్లు తెలియజేసింది. తనదైన నటనతో టాలీవుడ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న అనుపమ, ఇలా వరుస ఆఫర్స్ రావడంతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోతోంది. ఇక అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.