
కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (తెరాస, టీఆర్ఎస్) అని ప్రకటించిన తర్వాత ఊహించినట్లే మొట్ట మొదట బీఆర్ఎస్ పార్టీ, దాని ప్రభుత్వం, కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిరంకుశ పాలన చేసిన ఆ పార్టీలో ఉన్నందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
ఒకప్పుడు ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా కేసీఆర్ వచ్చేవారని, కానీ ఇప్పుడు ఫామ్హౌసులో నుంచి బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు. అయన పాలనలో బడుగు బలహీనవర్గాలు అణచివేత, వేధింపులకు గురయ్యాయన్నారు. నాడు ప్రజల మనిషిగా పేరొందిన కేసీఆర్ నేడు స్పందన లేదని మర మనిషిగా మారిపోయారని ఎద్దేవా చేశారు.
ఆయన చుట్టూ ఉన్న గుంట నక్కల చేతిలో బందీ అయిపోయారన్నారు. పార్టీ పేరులో తెలంగాణని వదులుకొని పార్టీ ఆత్మ కోల్పోయిందని, అటువంటి ఆత్మలేని శరీరం పనికిరాదన్నారు.
కనుక మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తల్లిగా, వారి గొంతుగా తాను టీఆర్ఎస్ పార్టీతో ప్రజల ముందుకు వచ్చానన్నారు.
గాడి తప్పిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టుకొని సామాజిక తెలంగాణ సాధన కోసం కృషి చేస్తానన్నారు. కేవలం పోరాటాలతో ఇది సాధ్యం కాదు కనుక పదవి, అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు.