
కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై అక్టోబర్ 31 లోగా తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో స్పీకర్ వారికి నోటీసులు పంపించి వివరణ తీసుకున్నారు.
తర్వాత వారిలో నలుగురు ఎమ్మెల్యేలను ముఖాముఖీ ప్రశ్నించారు. మిగిలిన ఆరుగురినీ ఇంకా ప్రశ్నించాల్సి ఉంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం తెలుసుకోవడం కూడా అవసరం. కనుక మరో రెండు నెలలు గడువు ఇవ్వాల్సిందిగా స్పీకర్ కార్యాలయం సుప్రీం కోర్టుకి లేఖ వ్రాసింది.
బీఆర్ఎస్ పార్టీ పిర్యాదు చేసిన ఎమ్మెల్యేలలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికేపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్లపై ఈ నెల 6,7,12,13 తేదీలలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరుపబోతున్నారు.
ముందుగా బీఆర్ఎస్ పార్టీ తరపున పిర్యాదు చేసినవారి వాదనలు విన్న తర్వాత సదరు ఎమ్మెల్యేల వాదనలు వింటారు. ఈవిదంగా రోజుకు ఒకరు చొప్పున నలుగురు ఎమ్మెల్యేలని, వారిపై పిర్యాదు చేసినవారి వాదనలు వింటారని స్పీకర్ కార్యాలయం తెలియజేసింది.