తెలంగాణ పోలీసులకు జాతీయ అవార్డు

తెలంగాణ పోలీసులకు జాతీయ అవార్డు లభించింది. పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు ధృవీకరించడం కోసం ‘వెరీ ఫాస్ట్’ అనే మొబైల్ యాప్‌ రూపొందించి, దాని ద్వారా చాలా వేగంగా, పారదర్శకంగా సేవలు అందిస్తున్నందుకుగాను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పోలీస్ శాఖకి ఈ అవార్డు ప్రకటించింది. 

నేడు ఢిల్లీలో పాస్‌పోర్టు సేవా దివస్‌ కార్యక్రమంలో విదేశాంగశాఖ మంత్రి ఎస్.జయశంకర్ చేతుల మీదుగా తెలంగాణ ఇంటలిజన్స్ చీఫ్ శివదర్ రెడ్డి ఈ అవార్డు అందుకోబోతున్నారు. తెలంగాణ పోలీస్ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి సగటున సుమారు 8 లక్షల మంది పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు.

కనుక పోలీసులు రోజుకి సుమారు 2,000 మందికి పైగా దరఖాస్తుదారుల ఇళ్ళకు వెళ్ళి వారి వివరాలు ధృవీకరిస్తున్నారు. అంటే నెలకు సుమారు 60,000 మంది దరఖాస్తులు క్లియర్ చేస్తున్నారన్న మాట.! వీలైనంత వేగంగా ప్రజలు పాస్‌పోర్టులు పొందేందుకు తెలంగాణ పోలీసులు ఎంతగానో తోడ్పడుతునందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ఇస్తోంది.