రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పోలీస్ శాఖలో కొందరిపై కేసులు నమోదు చేసి విచారణ జరిపారు. కొందరు జైల్లో మరికొందరు బెయిల్పై బయట ఉన్నారు. ఇప్పుడు ఈ కేసు రెండో దశ విచారణలో బిఆర్ఎస్ పార్టీ నేతలకు పోలీసులు నోటీసులు పంపించి విచారణ మొదలుపెట్టారు.
ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యని పోలీసులు ప్రశ్నించి ఆయన చెప్పిన వివరాలను రికార్డ్ చేశారు. ఈరోజు కల్వకుర్తి బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ని జూబ్లీహిల్స్ ఏసీపీ ప్రశ్నిస్తున్నారు.
ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి ఇంతవరకు విచారణ కొనసాగుతోంది. వారిరువురూ చెప్పిన వివరాల ఆధారంగా మరికొంతమంది బిఆర్ఎస్ నేతలకు నోటీసులు పంపించనున్నారు. వారిలో ఒక మాజీ మంత్రి కూడా ఉన్నట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసు, ఎన్నికల సమయంలో పోలీస్ అధికారుల చేత వారి వాహనాలలోనే డబ్బు తరలించడం రెండూ తీవ్రమైన నేరాలే. కానీ వాటిని పోలీసులు సాక్ష్యాధారాలతో సహా నిరూపించినా, ఈ కేసులో కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏళ్ళ తరబడి సాగకుండా ఉండవు.
కనుక ఈ కేసులతో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్ల మెడకు ఉచ్చు బిగించగలదేమో కానీ వారిని ఎన్నటికీ బండించి ఉంచలేదు. రేవంత్ రెడ్డి తనని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే రెండు నెలల్లో బెయిల్పై బయటకు వచ్చేస్తానని కేటీఆర్ చెపుతున్నారు కదా?