తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రమంత్రికి ఫిర్యాదు చేయడంపై కాంగ్రెస్ పార్టీ ధీటుగా స్పందించింది. మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, “ఫార్ములా-1 రేసింగ్ నిర్వహణ పేరుతో కేటీఆర్ రూ.55 కోట్లు అక్రమానికి పాల్పడ్డారు. కనుక ఆ కేసులో జైలుకి వెళ్ళక తప్పదనే భయంతోనే ఈ వంకతో ఢిల్లీ పెద్దల కాళ్ళపై పడ్డారని మేము భావిస్తున్నాము. ఏదోవిదంగా వారిని ఒప్పించి ఈ కేసు విచారణ జరుగకుండా, తనని పోలీసులు అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారు.
ఒకవేళ ఫార్ములా-1 రేసింగ్ నిర్వహణలో తాను ఎటువంటి తప్పు , అధికార దుర్వినియోగం చేయకపోతే విచారణకు హాజరయ్యి తన నిజాయితీని నిరూపించుకోవచ్చు కదా?కానీ ఆయనపై ఇంకా కేసు నమోదు చేయకమునుపే ఢిల్లీ పెద్దలని కలవడం చూస్తే ఈ కేసులో తాను జైలుకి వెళ్ళక తప్పదని కేటీఆర్ భావిస్తున్నట్లే ఉన్నారు. అంటే కేటీఆర్ అవినీతికి పాల్పడటం వలననే భయపడుతున్నారని స్పష్టం అవుతోంది,” అని మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం స్పందిస్తూ, “కేటీఆర్ నన్ను అరెస్ట్ చేసుకోండి. జైలుకి వెళ్ళి యోగా చేసుకొని ఫిట్గా తయారయ్యి 2 నెలల్లో బయటకు వచ్చి పాదయాత్ర చేస్తానని గొప్పగా చెప్పుకున్నారు కదా? మరి జైలుకి వెళ్ళేందుకు ఎందుకు భయపడుతున్నారు. ఢిల్లీ పెద్దల కాళ్ళపై పడి ఎందుకు వేడుకుంటున్నారు?
తెలంగాణలో అత్యంత అవినీతి ప్రభుత్వం, అవినీతి పాలన, అవినీతి కుటుంబం మీది. అందుకే ప్రజలు మీకు కొర్రు కాల్చివాతపెట్టారు. అయినా మీకు బుద్ధి రాలేదని నిన్న మీ మాటలతో అర్దమవుతోంది.
రేవంత్ రెడ్డి నీలాగ తండ్రి వలన ముఖ్యమంత్రి పదవి పొందలేదు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి స్వయంకృషితో ముఖ్యమంత్రిగా ఎదిగారు. మీలాగ అధికారంలోకి రాగానే సామాన్య ప్రజలను దూరం పెట్టలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు,” అని సత్యం శ్రీరంగం అన్నారు.