చివరి విడత పోలింగ్‌ షురూ... ముగియగానే ఎగ్జిట్ పోల్స్

సార్వత్రిక ఎన్నికలలో 7వ మరియు చివరి విడత పోలింగ్‌ నేడు జరుగుతోంది. 8 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 57 ఎంపీ సీట్లకు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం అయ్యింది.

ఈరోజు పోలింగ్‌లో పలువురు ప్రముఖుల భవిష్యత్‌పై ఓటర్లు తీర్పు చెప్పబోతున్నారు. వారిలో వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోడీ, హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రముఖ నటి కంగనా రనౌత్, కేంద్రమంత్రి ఆర్‌కె సింగ్‌ తదితరులున్నారు. 

ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగవలసి ఉండగా అప్పటి వరకు క్యూలైన్లలో ఉన్నవారందరినీ ఓట్లు వేసేందుకు అనుమతిస్తారు. 

ఈరోజు చివరి విడత పోలింగ్‌ ముగిసేవరకు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నివేదికలు ప్రకటించరాదని ఈసీ ఆంక్ష విధించింది. కనుక ఈరోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ గడువు ముగిసిన వెంటనే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలు ప్రకటించబోతున్నాయి. 

ముఖ్యంగా ఈసారి ఆంధ్రాలో శాసనసభ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కనుక రెండు రాష్ట్రాలలో ఏ పార్టీలు గెలువబోతున్నాయో నేడు స్పష్ఠత వచ్చే అవకాశం ఉంది.