తెలంగాణలో మళ్ళీ నాటి సమైఖ్య రాష్ట్రంలో దుస్థితి: కేటీఆర్‌

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సిఎం రేవంత్‌ రెడ్డికి ఓ బహిరంగ లేఖ వ్రాశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రాష్ట్రంలో నాటి సమైఖ్య రాష్ట్రంలో దుస్థితి మళ్ళీ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యిందని ఆక్షేపించారు.

కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మి చేనేత కార్మికులకు ఓట్లు వేసి గెలిపించి అధికారం కట్టబెడితే ఇప్పుడు వారి జీవితాలతోనే ఆడుకుంటున్నారని కేటీఆర్‌ విమర్శించారు. 

బిఆర్ఎస్ హయాంలో చేనేత కార్మికులందరికీ బతుకమ్మ చీరలు నేసే పని అప్పగించి వారికి స్థిరమైన ఆదాయం కల్పించామని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంతవరకు వారి గోడు పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో మళ్ళీ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

కనుక ఇకనైనా చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల నేత పని అప్పగించి వారిని ఆడుకోవాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ముందుగా ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని చేనేత కార్మికుల బకాయిలు తీర్చాలని కేటీఆర్‌ సూచించారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎంత సేపు బిఆర్ఎస్ పార్టీపై దృష్టి పెట్టే బదులు పాలనపై దృష్టి సారించి రాష్ట్రంలో పేరుకుపోతున్న సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్‌ హితవు పలికారు.