శాసనసభ ఆవరణలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా

ఈరోజు శాసనసభ సమావేశాలలో కేసీఆర్‌ని ఉద్దేశ్యించి సిఎం రేవంత్‌ రెడ్డి “ఇప్పటికే ప్రజలు ఫ్యాంట్ ఊడదీసి పంపించారు. అది తట్టుకోలేక ఎవరికీ చెపుకోలేక ఫామ్‌హౌస్‌లో బోర్లాపడ్డి కాలు విరగొట్టుకున్నారు. అయినా కేసీఆర్‌ పొగరు తగ్గలేదు.

ముఖ్యమంత్రినైన నన్ను మేడిగడ్డ బ్యారేజికి ఏం పీకడానికి పోయాడు?” అంటూ చాలా చులకనగా మాట్లాడారు. కేసీఆర్‌ పొగరు ఇంకా అణగకపోతే ప్రజలే ఈసారి ఒంటి మీద మిగిలిన బట్టలను ఊడదీసి తరిమికొడతారు జాగ్రత్త! శాసనసభ సమావేశాలకు వస్తే తన అవినీతి బయటపడుతుందని, జైలుకి వెళ్ళవలసి వస్తుందని రాకుండా ఫామ్‌హౌస్‌లో పడుకుంటున్నారు. 

శాసనసభకు రాలేనప్పుడు నల్గొండ సభకి ఎలా వెళ్ళారు? వీల్ చైర్ నాటకాలు ప్రజల సానుభూతి కోసమే. దమ్ముంటే కేసీఆర్‌ శాసనసభకు రావాలి. వచ్చి మమ్మల్ని ఎదుర్కోవాలి,” అంటూ సిఎం రేవంత్‌ రెడ్డి సవాలు విసిరారు. 

దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకవుట్ చేసి శాసనసభ ఆవరణలో మీడియా పాయింట్ వద్దకు వెళ్ళబోతుంటే అక్కడ పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దాంతో కేటీఆర్‌, హరీష్ రావులు వారితో వాదనకు దిగారు. 

“శాసనసభలోని మాట్లాడనీయరు... బయట కూడా మాట్లాడనీయరు... రేవంత్‌ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు,” అంటూ అక్కడే నేలపై కూర్చొని నిరసనలు తెలిపారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయినా పోలీసులు వారిని మీడియా పాయింట్ వద్దకు అనుమతించలేదు. 

ఒకప్పుడు వారికి సెల్యూట్ కొట్టిన పోలీసుల చేతనే వారిని అడ్డగించి నేలపై కూర్చోబెట్టించడం ద్వారా రేవంత్‌ రెడ్డి ‘స్వీట్ రివెంజ్’ తీర్చుకున్నట్లుంది.