
సిఎం కేసీఆర్ నేడు ముంబై వెళ్ళి మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ థాక్రేతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ముంబై బయలుదేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఉద్దవ్ థాక్రేతో భేటీ అవుతారు. సమావేశం ముగిసిన తరువాత సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ అధినేత శరత్ పవార్తో భేటీ అవుతారు. ఆయనతో సమావేశం ముగిసిన తరువాత మళ్ళీ హెలికాప్టర్లో రాత్రికి హైదరాబాద్ చేరుకొంటారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకుగాను నేడు ముంబై వెళ్ళి శివసేన, ఎన్సీపీ అధినేతలను కలుస్తున్నారు. సిఎం కేసీఆర్ పోరాటానికి మహా సిఎం ఉద్దవ్ థాక్రే ఇప్పటికే మద్దతు ప్రకటించారు. కనుక నేడు వారి భేటీలో ఈ పోరాటంలో ఏవిదంగా ముందుకు సాగాలనే అంశంపై లోతుగా చర్చించనున్నారు.