హైదరాబాద్‌ పేరు భాగ్యనగర్‌గా మారుస్తాం: రాజా సింగ్

గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్‌ సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తాము అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని చెప్పారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబాబాద్ తదితర జిల్లాలకు, నగరాలు, పట్టణాలకు నిజాం నవాబులు పెట్టినపేర్లను కూడా మారుస్తామని రాజా సింగ్‌ అన్నారు. దీని కోసం బిజెపి, ఆర్ఎస్ఎస్‌ కుట్రలు చేయవలసిన అవసరం లేదని, ఇదే తమ నిర్ణయమని చెప్పారు. యూపీ సిఎం యోగీ ఆధిత్యనాథ్ గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడే ఈ విషయం ప్రకటించామని రాజా సింగ్‌ చెప్పారు. నిజాం నవాబుల దౌర్జన్యాలను గుర్తుకు తెచ్చే అటువంటి పేర్లు మన రాజధానికి, జిల్లాలకు, పట్టణాలకు అవసరమా? అని రాజా సింగ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన మన అమరవీరుల పేర్లను జిల్లాలకు, పట్టణాలకు పెడతామని రాజా సింగ్‌ అన్నారు.