16.jpg)
స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మొత్తం 12 స్థానాలలో ఇదివరకే 6 స్థానాలలో పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా, మిగిలిన 6 స్థానాలకు ఈనెల 10న ఎన్నికలు జరిగాయి. ఈరోజు జరిగిన ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో మిగిలిన ఆ 6 స్థానాలలో కూడా టిఆర్ఎస్ అభ్యర్ధులే విజయం సాధించారు. దీంతో మొత్తం 12 స్థానాలు టిఆర్ఎస్ కైవసం అయ్యాయి.
విజేతలు: భాను ప్రసాద్ (కరీంనగర్-1), ఎల్.రమణ (కరీంనగర్-2); యాదవ్ రెడ్డి (మెదక్); తాత మధు (ఖమ్మం); దండె విటల్ (ఆదిలాబాద్); ఎంసీ కోటిరెడ్డి (నల్గొండ).
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1320 ఓట్లు పోల్ అవగా వాటిలో 1303 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. వాటిలో టిఆర్ఎస్ అభ్యర్ధులు ఎల్.రమణ 479 ఓట్లు, భానుప్రసాద్ 584 ఓట్లు వచ్చాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో టిఆర్ఎస్ అభ్యర్ధి యాదవ్ రెడ్డి 524 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ టిఆర్ఎస్కు 762, కాంగ్రెస్కు 238, స్వతంత్ర అభ్యర్ధికి కేవలం 6 ఓట్లు వచ్చాయి.
ఖమ్మం జిల్లాలో మొత్తం 738 ఓట్లు పోలవగా వాటిలో టిఆర్ఎస్ అభ్యర్ధి తాత మధు 480 ఓట్లు గెలుచుకొని విజయం సాధించారు.
ఆదిలాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ అభ్యర్ధి దండె విటల్ 667 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసిన నగేష్కు 226, లక్ష్మయ్యకు 26, వెంకటేశ్వర్లుకు 6, రాంసింగ్కు 5 ఓట్లు వచ్చాయి.