పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన టిఆర్ఎస్‌ ఎంపీలు

ధాన్యం కొనుగోలుపై కేంద్రప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఏడుగురు రాజ్యసభ ఎంపీలు, 9 మంది లోక్‌సభ ఎంపీలు శీతాకాల పార్లమెంటు సమావేశాలను బహిష్కరించారు. ఈ రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే టిఆర్ఎస్‌ ఎంపీలు ఈరోజు నల్ల చొక్కాలు ధరించి హాజరయ్యారు. అనంతరం టిఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ధాన్యం కొనుగోలుపై కేంద్రప్రభుత్వం వైఖరికి నిరసనగా సభ నుంచి వాకవుట్ చేస్తున్నామని ప్రకటించి అందరూ బయటకు వచ్చేశారు. 

ఈ సందర్భంగా ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, “మా మంత్రులు, ఎంపీలు కేంద్రమంత్రులను కలిసి కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పాము. కానీ వారు పట్టించుకోలేదు. పార్లమెంటు సమావేశాలలో ఈ సమస్యను ప్రస్తావించి మళ్ళీ  కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాము. మా రైతుల సమస్యలకు పార్లమెంటులో పరిష్కారం దొరుకుతుందని చాలా ఆశ పడ్డాము కానీ ఇక్కడా మాకు నిరాశే ఎదురైంది. అందుకే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి మా నిరసనను తెలియజేశాము,” అని చెప్పారు. 

హైదరాబాద్‌ తిరిగి వెళ్ళిన తరువాత సిఎం కేసీఆర్‌తో చర్చించి తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలని టిఆర్ఎస్‌ ఎంపీలు నిర్ణయించారు.