
ధాన్యం కొనుగోలు వ్యవహారంపై టిఆర్ఎస్ ప్రభుత్వం వైఖరికి అనుగుణంగా ఆ పార్టీ ఎంపీలు సోమవారం రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. ఓ దశలో వారు వెల్ల్లోకి దూసుకువచ్చేందుకు ప్రయత్నించడంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ఎంపీలను నియంత్రించవలసిందిగా ఆయన ఎంపీ కె.కేశవరావును కోరారు. కానీ టిఆర్ఎస్ ఎంపీలు ఆందోళన కొనసాగించడంతో వెంకయ్య నాయుడు సభను రెండు గంటలకు వాయిదా వేశారు. తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఎంపీ కె.కేశవరావు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఆయన తిరస్కరించారు.
సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవగానే టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలియజేశారు. తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.