యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు: కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి మళ్ళీ కేంద్రప్రభుత్వంపై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వచ్చే యాసంగి సీజనులో ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రప్రభుత్వం స్పష్టంగా చెప్పినందున వచ్చే యాసంగి సీజనులో రాష్ట్రంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. కనుక రైతులెవరూ ధాన్యం పండించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ రైతులు మిల్లర్లతో లేదా వ్యాపారులతో లేదా విత్తన కంపెనీలతో పంట కొనుగోలుకు ముందస్తు ఒప్పందాలు చేసుకొని పండించుకోవచ్చు. అలాగే వారి ఆహార అవసరాలకు పండించుకోవచ్చు. వారిని అడ్డుకోదు. రైతులు ఏ పంట పండించినా తెలంగాణ ప్రభుత్వం వారికి యధాప్రకారం రైతుబంధు వగైరా అందజేస్తుంది. రాష్ట్రంలో వ్యవసాయాన్ని అన్ని విదాల అభివృద్ధి చేసి, రైతులకు ఎంతో తోడ్పడిన మా ప్రభుత్వం ఇప్పుడు రైతులను ధాన్యం పండించవద్దని విజ్ఞప్తి చేయవలసి రావడం చాలా బాధ కలిగిస్తోంది,” అని చెప్పారు.