తీన్‌మార్ మల్లన్న చంచల్‌గూడా జైలుకి

క్యూ న్యూస్ ఛానల్‌ అధినేత నవీన్ అలియాస్ తీన్‌మార్ మల్లన్నకు సికింద్రాబాద్‌ న్యాయస్థానం 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడా జైలుకి తరలించారు. సికింద్రాబాద్‌లోని ఓ జ్యోతిష్యుడిని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలతో చిలకలగూడా పోలీసులు శుక్రవారం రాత్రి తీన్‌మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్స్ 306,511 కింద కేసులు నమోదు చేసి ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. తీన్‌మార్ మల్లన్న తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, చిలకలగూడ పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరారు. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.