సిఎం కేసీఆర్‌ నేడు కరీంనగర్‌ పర్యటన

సిఎం కేసీఆర్‌ పది రోజుల వ్యవధిలోనే మరోసారి కరీంనగర్‌ జిల్లా పర్యటనకు వెళుతున్నారు. నిన్న, ఈరోజు వరుసగా ఇద్దరు టిఆర్ఎస్‌ నేతల పిల్లల పెళ్లిళ్లు ఉండటంతో వాటికి హాజరయ్యేందుకు సిఎం కేసీఆర్‌ గురువారం సాయంత్రమే హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. 

ముందుగా వరంగల్‌కు వెళ్ళి అక్కడ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌ కుమారుడి పెళ్ళికి హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం రోడ్డు మార్గంలో కరీంనగర్‌ తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌ భవన్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేశారు. 

ఈరోజు ఉదయం 10.30 గంటలకు కరీంనగర్‌లో టిఆర్ఎస్‌ నేత రూప్ సింగ్‌ కుమార్తె పెళ్ళికి హాజరవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు కరీంనగర్‌ కలెక్టరేట్ కార్యాలయం చేరుకొని జిల్లా అధికారులతో దళిత బంధు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. హుజూరాబాద్‌లో దళిత బంధు పధకం పైలట్ ప్రాజెక్టును ఏవిదంగా అమలుచేయాలనే అంశంపై సిఎం కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేస్తారు. సమావేశం ముగిసిన తరువాత హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ తిరిగి వెళ్ళిపోతారు.