బిజెపి నేత ఈటల రాజేందర్ ఈరోజు అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి చేరుకోగానే మళ్ళీ సిఎం కేసీఆర్పై విమర్శల వర్షం కురిపించారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులందరినీ సిఎం కేసీఆర్ బయటకు పంపిస్తూ ఉద్యమద్రోహులను చుట్టూ చేర్చుకొని పరిపాలిస్తున్నారు. ఆనాడు మానుకోట ఓదార్పుయాత్రలో ఉద్యమకారులపై రాళ్ళదాడి చేసిన ఉద్యమద్రోహికి (కౌశిక్ రెడ్డి) ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. సిఎం కేసీఆర్ దృష్టి ఎప్పుడూ ఓట్ల మీదే ఉంటుంది. అందుకే హుజూరాబాద్లో ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో నాయకుడి తలకి వెలకట్టి కొనేస్తున్నారు. ఉపఎన్నిక పూర్తయ్యేలోగా ఇంకా ఎన్నివేల కోట్లు ఖర్చు చేస్తారో తెలీదు. కానీ ఎంత డబ్బు వెదజల్లినా హుజూరాబాద్ ప్రజలు టిఆర్ఎస్కు ఉపఎన్నికలో తప్పకుండా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.