దర్బంగా ప్రేలుళ్ళ సూత్రధారులను బిహార్‌కు తరలింపు

బిహార్‌ రాష్ట్రంలో దర్బంగా రైల్వేస్టేషన్‌లో ఇటీవల జరిగిన బాంబు ప్రేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఆ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌కు వచ్చి గురువారం మల్లేపల్లిలోని భారత్ గ్రౌండ్స్ వద్ద ఇమ్రాన్ మాలిక్ అలియాస్ ఇమ్రాన్ ఖాన్‌, మహ్మద్ నాసిర్ ఖాన్ అలియాస్ నాసిర్ మాలిక్‌లను (మాలిక్ బ్రదర్స్) ఇళ్ళలో సోదాలు చేశారు. వారి ఇంట్లో కొన్ని ముఖ్యమైన పత్రాలు, కొన్ని రసాయనాలు దొరికినట్లు సమాచారం. అనంతరం వారిని నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి వారిని తదుపరి విచారణ కొరకు బిహార్‌కు తీసుకువెళ్లారు.   

హైదరాబాద్‌, మల్లేపల్లిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బట్టలు, ఫర్నీచర్ వ్యాపారం చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు. మాలిక్ బ్రదర్స్ కూడా ఆవిదంగానే బిహార్‌ నుంచి వచ్చి బట్టల వ్యాపారం ముసుగులో ఉగ్రవాద కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. వారే మహ్మద్ సూఫీయాన్ పేరుతో హైదరాబాద్‌ నుంచి రైల్వే పార్సిల్ సర్వీస్ ద్వారా సుమారు 35 కేజీల ఒక బట్టల మూటలో ఐఈడీ బాంబులు పెట్టి పంపించినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. మాలిక్ బ్రదర్స్‌కు లష్కరే తోయిబా ముఖ్యనేత ఇక్బాల్ ఏఐబీపీఏ 9085సీ నంబర్‌ కలిగిన ఓ పాన్‌కార్డ్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. మాలిక్ బ్రదర్స్ దానినే తమ లావాదేవీలకు వినియోగిస్తున్నారు.  

మాలిక్ బ్రదర్స్ ఆ బాంబును కదులుతున్న రైలులో పేల్చి విధ్వండమ్ సృష్టించాలనుకొన్నారో లేక దర్బంగా రైల్వేస్టేషన్‌లోనే పేల్చాలనుకొన్నారో లేక దర్బంగాలో ఎవరికైనా గుట్టుగా రవాణా చేస్తున్నారనే విషయం తదుపరి విచారణలో తేలుతుంది.