తెలంగాణ రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు

భారత్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. కానీ యావత్ రాష్ట్రానికి ఒకే ఒక విమానాశ్రయం (శంషాబాద్) ఉంది. కనుక రాష్ట్రంలో మరికొన్ని విమానాశ్రయాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఉడాన్ పధకం కింద దేశంలో చిన్న పట్టణాలకు విమానసేవలు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించిన కేంద్రప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. అయితే విమానాశ్రయాల ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చును కేంద్రప్రభుత్వమే  భరించాలని మొదట అనుకొన్నప్పటికీ, దానిని రాష్ట్రాలే భరించాలని తేల్చి చెప్పడంతో చాలా రాష్ట్రాలు వెనకడుగువేశాయి. 

కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో కనీసం మరో రెండు,మూడు విమానాశ్రయాలైనా ఏర్పాటుచేయాలని పట్టుదలతో ఉన్నందున, రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై అధ్యయనం చేసి, వాటి ఏర్పాటుకయ్యే ఖర్చు, అవసరమైన భూమి తదితర వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అనుబంధ సాంకేతిక విభాగాన్ని కోరింది. ఈ మేరకు ఆ సంస్థ అధ్యయనం చేసి తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది. దానిలో తక్కువ ఖర్చుతో జాతీయస్థాయి విమానసేవల కోసం ఫేజ్-1, భారీ పెట్టుబడి అవసరం అయ్యే అంతర్జాతీయ విమానసేవల కోసం ఫేజ్-2గా విభజించి నివేదిక సమర్పించింది. 

వరంగల్‌ నగరం శివారులోగల మామునూరు వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయబోతున్నట్లు ఇటీవల సిఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మామునూరు వద్ద గల నిజాంకాలంనాటి ఎయిర్ ఫీల్డ్ ఉంది. దానిని తక్కువ ఖర్చుతో పునరుద్దరించి, డొమెస్టిక్ విమానాశ్రయంగా ఏర్పాటు చేయవచ్చని నివేదికలో పేర్కొన్నందునే సిఎం కేసీఆర్‌ ఆ ప్రకటన చేసి ఉండవచ్చు.      

రాష్ట్ర ప్రభుత్వానికి అందిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో విమానాశ్రయాలు ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలు, వాటి ఏర్పాటుకయ్యే ఖర్చు వివరాలు:

జిల్లా/ ప్రాంతం

ఫేజ్1 (డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్‌)

ఫేజ్-2 (ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌)

వరంగల్‌ (మామునూరు)

రూ. 248 కోట్లు

724 ఎకరాలు

రూ.345 కోట్లు

1,053 ఎకరాలు

ఆదిలాబాద్‌

రూ. 289 కోట్లు

444 ఎకరాలు

రూ.337 కోట్లు

620 ఎకరాలు

బసంత్ నగర్‌ (పెద్దపల్లి)

రూ. 248 కోట్లు

408 ఎకరాలు

రూ.321  కోట్లు

566 ఎకరాలు

జక్రాన్ ఖాన్ (నిజామాబాద్‌)

రూ. 328 కోట్లు

510 ఎకరాలు

రూ.348 కోట్లు

566 ఎకరాలు

పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం)

రూ. 483 కోట్లు

406 ఎకరాలు

-

672 ఎకరాలు

దేవరకద్ర (మహబూబ్‌నగర్‌)

రూ. 238 కోట్లు

303 ఎకరాలు

రూ.355 కోట్లు

644 ఎకరాలు