హైదరాబాద్లోని రాష్ట్ర భాజపా కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకలలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర బిజెపి నేతలు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతాకం ఎగరవేసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. ఉద్యమాల ద్వారా సాధించిన తెలంగాణలో కుటుంబపాలన వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. రాష్ట్రంలో అవినీతి ఎక్కువైపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన కొనసాగుతుందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడితే దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పి కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, కొత్త వృద్ధాప్య పెన్షన్ హామీలను వెంటనే నెరవేర్చాలని అన్నారు. వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ జారీ చేయాలని అన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు తెలంగాణ రైతులు మద్దతు తెలపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలపై టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దుష్ప్రచారం మానుకోవాలని బండి సంజయ్ సూచించారు.