
దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు చిక్కులో పడ్డారు. ఆయన అనుచరులుగా చెప్పబడుతున్న కొందరు వ్యక్తులు మంగళవారం సాయంత్రం ఒక కారులో రూ.40 లక్షల నగదుతో శామీర్ పేట వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. వారు ఆ సొమ్మును పటాన్ చేరు నుంచి సిద్దిపేటకు తీసుకువెలుతున్నట్లు ప్రాధమిక విచారణలో తేలిందని డీసీపీ పద్మజ తెలిపారు. రఘునందన్ రావు వ్యక్తిగత కార్యదర్శి సంతోష్ వారితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించామని ఆమె తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎటువంటి రసీదులు, దృవపత్రాలు లేకుండా అంతా సొమ్మును తరలిస్తున్నందుకు వారు నాలుగురిపై కేసులు నమోదు చేసి అదుపులో తీసుకొన్నామని డీసీపీ పద్మజ తెలిపారు.
రఘునందన్ రావు ఈ ఘటనపై ఇంకా స్పందించవలసి ఉంది. మంగళవారం రాత్రి బిజెపి అధిష్టానం దుబ్బాక బిజెపి అభ్యర్ధిగా రఘునందన్ రావు పేరును ప్రకటించింది.
టిఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేస్తున్నారు. ఇవాళ్ళ కాంగ్రెస్ అభ్యర్ధి పేరును ప్రకటిస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నిన్న టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నట్లు సమాచారం.