
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రాత్రి ప్రగతి భవన్లో ప్రెస్మీట్లో మాట్లాడుతూ, “14 అంతస్తులలో 540 గదులున్న గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు బదిలీ చేశాం. దానిలో శాశ్విత ప్రాతిపదికన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్ ) ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాము. కరోనా రోగులకు చికిత్స చేసేందుకు వీలుగా ఇప్పటికే దానిని 1,500 పడకల ఆసుపత్రిగా మార్చాము. ఈ సంక్షోభం నుంచి బయటపడిన తరువాత టిమ్స్ ను పూర్తిస్థాయి ప్రభుత్వ వైద్యకళాశాలగా తీర్చిదిద్దుతాము. దానిలో 50 శాతం పడకలు సాధారణ వైద్యచికిత్సలకు, మిగిలిన 50 శాతం సూపర్ స్పెషాలిటీ వార్డులకు కేటాయిస్తాము. భవిష్యత్లో అక్కడే మరికొంత భూమి సేకరించి టిమ్స్ ను ఎయిమ్స్ స్థాయిలో తీర్చి దిద్దుతాము,” అని చెప్పారు.