ఆ నలుగురు 50 గంటలు పోరాడారు

నలుగురు పాక్ ఉగ్రవాదులు వందల మంది సైనికులతో ఏకధాటిగా 50 గంటలు పోరాడారంటే మామూలు విషయమేమీ కాదు. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో పాంపోర్ వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఈడీఐ)లో సోమవారం తెల్లవారుజామున నలుగురు ఉగ్రవాదులు ప్రవేశించి భవనాన్ని తమ అధీనంలోకి తీసుకొన్నారు. అప్పటి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు వారికీ భద్రతాదళాలకి మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.

మొదటి రోజునే ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతాదళాలు నిన్న మరొకడిని, ఈరోజు మిగిలిన ఇద్దరినీ  మట్టుబెట్టి మళ్ళీ భవనాన్ని తమ అధీనంలోకి తీసుకొని అన్ని గదులని క్షుణంగా గాలిస్తున్నాయి. రెండున్నర రోజుల పాటు ఏకధాటిగా ఉగ్రవాదులు పోరాడారంటే వారు చాలా బారీగా ఆయుధాలు, మందుగుండు తెచ్చుకొన్నారని స్పష్టం అవుతోంది. గతంలో కూడా వారు ఇదే భవనంలో చొరబడి రెండు రోజులు పాటు నిర్విరామంగా కాల్పులు జరిపారు. ఈసారి మరికొంచెం ఎక్కువ సమయం సేపు మన భద్రతాదళాలని వారు నిలువరించారు. గతంలో ఇద్దరు సైనికులు, ఒక ఆర్మీ ఆఫీసర్, ఆ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి చనిపోయారు. ఈసారి మాత్రం ఎటువంటి ప్రాణనష్టం జరుగాకుండానే ఉగ్రవాదులని మట్టుబెట్టగలిగారు.