తమిళనాడు ముఖ్యమంత్రికి ఏమయిందో?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం పాలవడంతో  గత 11 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వర్గాలు, ఆమె పార్టీ (అన్నాడిఎంకె) నేతలు, మంత్రులు చాలా గోప్యత పాటిస్తున్న కారణంగా పుకార్లు, ఊహగానాలకి తావిచ్చినట్లయింది. గత మూడు నాలుగు రోజులుగా వివిధ జిల్లాల నుంచి అన్నాడిఎంకె కార్యకర్తలు అపోలో ఆసుపత్రి వద్దకి చేరుకొంటున్నారు. నానాటికీ వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.   

ఆదివారం రాత్రి అపోలో ఆసుపత్రి వైద్యులు ఆమె ఆరోగ్యం గురించి క్లుప్తంగా ఒక ప్రకటన చేశారు. ఆమె చికిత్సకి స్పందిస్తున్నారని, మరికొన్నాళ్ళు ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుందని చెప్పారు. కానీ ఆమె అనారోగ్యానికి కారణాలు చెప్పలేదు. మొన్నరాత్రి తమిళనాడు ఇన్-చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు అపోలో ఆసుపత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడివెళ్ళి కాసేపటి తరువాత, “జయలలిత కోలుకొంటున్నారు” అని రాజ్ భవన్ నుంచి ఒక క్లుప్తమైన ప్రకటన వెలువడింది. అన్నాడిఎంకె అధికార ప్రతినిధి కూడా అంతకంటే ఎక్కువగా చెప్పడం లేదు. 

మొదట ఐసియూలో ఉన్న ఆమెని క్రిటికల్ కేర్ విభాగంలోకి మార్చడం, ఆమె వైద్యానికి స్పందిస్తున్నారని చెప్పడం గమనిస్తే ఆమె ఆరోగ్యపరిస్థితి ప్రమాదంగానే ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఆమెకి చికిత్స అందించడానికి లండన్ నుంచి డాక్టర్ రిచర్డ్ అనే ప్రముఖ వైద్యుడిని చెన్నైకి రప్పించడంతో ఆమెకి ఏమైందోనని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అన్నాడిఎంకె కార్యకర్తలు  ఆమె ఆరోగ్యం కోసం గుళ్ళలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.  

తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో అన్నాడిఎంకె, కరుణానిధి నేతృత్వంలోని ప్రతిపక్ష డిఎంకె పార్టీలే రాజకీయాలని శాశిస్తుంటాయి. వృద్దాప్యం కారణంగా కరుణానిధి ఇదివరకులాగా రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొనలేకపోతున్నారు. ఆయన కొడుకులు అళగిరి, స్టాలిన్ క మధ్య ఆధిపత్యపోరుతో ఆ పార్టీ సతమతం అవుతోంది. ఆ కారణం జయలలితకి ఎదురే ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆమె అనారోగ్యం పాలవడంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ రాజకీయాల గురించి ఇది మాట్లాడే సమయం కాదు కనుక తమిళనాడులో అధికార ప్రతిపక్షాలన్నీ తెర వెనుక రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకొంటున్నారు.